సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన చంద్రబాబు

అమరావతి: పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. వైసీపీ పాలనలో ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రశాంత వాతావరణంలో, నిష్పాక్షికంగా, స్వేచ్చాయుత ఎన్నికలు జరపాలని ఒక ప్రకటనలో చంద్రబాబు కోరారు. ‘వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతోన్న రాజ్యాంగ ఉల్లంఘనలు అన్నీఇన్నీ కావు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను సజావుగా పని చేయనీయకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. చట్టసభలు, పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, మీడియా 4 మూల స్థంభాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. శాసన మండలి రద్దుకు బిల్లు, నిజాయితీగా పనిచేసే అధికారులకు వేధింపులు, న్యాయవ్యవస్థపై దాడి, న్యాయమూర్తులపై దుర్భాషలు, ఎన్నికల సంఘంపై దాడి, ఈసీని కులం పేరుతో దూషించడం, జీవో 2430 ద్వారా మీడియాపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, కోర్టు తీర్పులను కూడా అమలు చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల విచ్చిన్నమే అజెండాగా పెట్టుకున్నారు. ప్రతి సందర్భంలోనూ కోర్టులే జోక్యం చేసుకుని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం హర్షణీయం’ అని పేర్కొన్నారు.
‘పంచాయితీ ఎన్నికలపై ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలి. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలి. నిష్పక్షపాతంగా, సజావుగా పంచాయితీ ఎన్నికలు జరపాలి. మార్చిలో స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసా విధ్వంసాలు, తప్పుడు కేసులు- అక్రమ నిర్బంధాలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.