ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 4న తుదిగడువు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8 తుది గడువు. మార్చి 15న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు.
తెదేపా నేతలు గుమ్మడి సంధ్యారాణి, గుండుమల తిప్పేస్వామి, వీవీవీ చౌదరితో పాటు వైకాపా నేతలు మహ్మద్ ఇక్బాల్, పిల్లి సుభాష్ చంద్రబోస్, చల్లా రామకృష్ణారెడ్డి స్థానాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సంధ్యారాణి, తిప్పేస్వామి, వీవీవీ చౌదరి, మహ్మద్ ఇక్బాల్ పదవీ కాలం పూర్తవగా.. పిల్లి సుభాష్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరోవైపు చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో ఇటీవల మృతిచెందారు.